ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

కృష్ణస్వామి కస్తూరి రంగన్‌

ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఎక్స్‌ కిరణాలు, గామా కిరణాల ఆస్ట్రానమీపై పరిశోధనలు చేశారు.


ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఎక్స్‌ కిరణాలు, గామా కిరణాల ఆస్ట్రానమీపై పరిశోధనలు చేశారు. ఇస్రో ఛైర్మన్‌గా పనిచేశారు. భారత అంతరిక్ష కార్యక్రమంలో మహోన్నత పాత్ర పోషించారు. చంద్రయాన్, గగన్‌యాన్, స్పెడెక్స్‌ లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల రూపకల్పనకు కస్తూరి రంగన్‌ వేసిన బలమైన పునాదులే కారణం. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ-2020పై ఏర్పాటైన కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు. ప్రణాళికా సంఘం సభ్యుడిగానూ పనిచేశారు. ఫాదర్‌ ఆఫ్‌ పీఎస్‌ఎల్‌వీగా పేరొందిన కస్తూరి రంగన్‌ జీవితంలోని ముఖ్య విశేషాల గురించి తెలుసుకుందాం..!

బాల్యం - వృత్తి జీవితం

  • కస్తూరి రంగన్‌ 1940, అక్టోబరు 24న కేరళలోని ఎర్నాకుళంలో జన్మించారు. పాఠశాల విద్యను ఎర్నాకుళంలోని శ్రీరామ వర్మ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. అక్కడే ఆయనకు సైన్స్‌ విద్య పట్ల ఆసక్తి కలిగింది.
    తర్వాత ముంబయిలో బాంబే విశ్వవిద్యాలయానికి (ప్రస్తుతం ముంబయి విశ్వవిద్యాలయం) అనుబంధంగా ఉన్న రామ నారాయణ్‌ రుయా కాలేజీలో చేరారు. 1961లో భౌతికశాస్త్రంలో బీఎస్సీ (ఆనర్స్‌) పట్టా పొందారు. డిగ్రీ చదివే సమయంలో ఆయన అంతరిక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేయాలని భావించారు. భౌతికశాస్త్రాన్ని ఎలక్ట్రానిక్స్‌తో మిళితం చేయడం ద్వారా ఖగోళ పరిశోధనలపై అవగాహన పెంచుకోవచ్చని భావించారు.
  • అనంతరం ఎంఎస్సీ చదివేందుకు బాంబే యూనివర్సిటీకి వెళ్లారు. 1963లో ఎలక్ట్రానిక్స్ లో ప్రత్యేకతతో భౌతికశాస్త్రంలో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ పూర్తి చేశారు.
  • అంతరిక్ష రంగంలో పరిశోధనల కోసం ఆయన అహ్మదాబాద్‌లోని ఫిజికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (పీఆర్‌ఎల్‌)లో చేరారు. అందులో అధిక శక్తిమంతమైన ఎక్స్‌ కిరణాలు, గామా కిరణాల ఆస్ట్రానమీపై పరిశోధనలు చేశారు. 1971లో ప్రయోగాత్మక హై ఎనర్జీ ఖగోళశాస్త్రంలో డాక్టరేట్‌ పట్టా (పీహెచ్‌డీ) పొందారు.
  • కస్తూరి రంగన్‌ 1971లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో భౌతిక శాస్త్రవేత్తగా చేరారు. భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహమైన ఆర్యభట్ట ప్రాజెక్ట్‌ బృందంలో కీలకంగా వ్యవహరించారు. దీన్ని 1975, ఏప్రిల్‌ 19న రష్యా వాహక నౌక ఇంటర్‌ కాస్మోస్‌ సీ-1 రాకెట్‌ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
  • భారతదేశ మొదటి రెండు ప్రయోగాత్మక భూ పరిశీలన ఉపగ్రహాలు భాస్కర-1 (1979, జూన్‌ 7న ప్రయోగించారు), భాస్కర-2 (1981, నవంబరు 20)లకు ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు.
  • తొలి భారతీయ రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహం ఐఆర్‌ఎస్‌-1ఎ (1988, మార్చి 17)కు సారథ్యం వహించారు.
  • యు.ఆర్‌.రావు శాటిలైట్‌ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఇన్ శాట్ -2, ఐఆర్‌ఎస్‌-1ఎ, ఐఆర్‌ఎస్‌-1బి ఉపగ్రహాల అభివృద్ధి ఆయన పర్యవేక్షణలోనే జరిగింది.
  • 1990 నుంచి 1994 వరకు ఆయన ఇస్రో ఉపగ్రహ కేంద్రం (ఐఎస్‌ఏసీ) డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

ఇస్రో ఛైర్మన్‌గా..

  • కస్తూరి రంగన్‌ 1994 ఏప్రిల్‌ నుంచి 2003 ఆగస్టు 27 వరకు ఇస్రో ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన హయంలో భారత అంతరిక్ష రంగం ఎంతగానో అభివృద్ధి చెందింది.
  • పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ)ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చారు. అందుకే ఈయన్ని ఫాదర్‌ ఆఫ్‌ పీఎస్‌ఎల్‌వీ అంటారు.
  • జియోసింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ) ప్రయోగ పరీక్షలను పర్యవేక్షించారు.
  • ప్రపంచంలోనే అత్యున్నత పౌర ఉపగ్రహాలైన ఐఆర్‌ఎస్‌-1సి, 1డి రూపకల్పన, అభివృద్ధి, ప్రయోగాలను పర్యవేక్షించారు.
  • రెండో తరం ఇన్‌శాట్‌ ఉపగ్రహాల రూపల్పనతో పాటు సముద్ర పరిశీలన ఉపగ్రహాలైన ఐఆర్‌ఎస్‌-పి3, పి4లను పర్యవేక్షించారు.
  • అంతరిక్షానికి సంబంధించి పలు విభాగాల్లో 250కి పైగా పరిశోధనా పత్రాలు ప్రచురించారు.
  • చంద్రుడిపై భారతదేశ మొట్టమొదటి మిషన్‌ అయిన చంద్రయాన్‌-1 (2008) అభివృద్ధిలోనూ ఆయన ముఖ్యభూమిక పోషించారు.

చివరగా..

  • భారత అంతరిక్ష రంగం అభివృద్ధికి కస్తూరి రంగన్‌ ఎంతగానో కృషి చేశారు. శాస్త్రీయ విజ్ఞాన పురోగతితోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన భావించారు. ఇస్రో ఛైర్మన్‌గా ఆయన హయాంలో చేపట్టిన ప్రయోగాలు, తీసుకున్న నిర్ణయాల కారణంగానే ప్రస్తుతం ఖగోళ రంగంలో మన దేశం టాప్‌-5 దేశాల్లో ఒకటిగా నిలిచింది. దేశంలో విద్యా విధాన రూపకల్పన, శాస్త్రీయ పరిశోధన రంగాలకు ఈయన ఎనలేని సేవలు 
    చేశారు. కస్తూరి రంగన్‌ 2025, ఏప్రిల్‌ 25న బెంగళూరులో మరణించారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

Q. కస్తూరి రంగన్‌ కమిటీ నివేదిక కింది దేనికి సంబంధించింది?(కేరళ పీఎస్సీ సివిల్‌ ఎక్సైజ్‌ ఆఫీసర్‌ (మహిళలు), 2018)

1) మొక్కల సంరక్షణ

2) పశ్చిమ కనుమల సంరక్షణ

3) గంగా ప్రక్షాళన ప్రణాళిక

4) రాజ్యాంగ సంస్కరణలు

సమాధానం:

Q. కింది ఎవరు గతంలో ఇస్రో ఛైర్మన్‌గా పనిచేశారు?(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌-2, 2019)

1) కస్తూరి రంగన్‌

2) సుబ్రమణియన్‌

3) కార్తికేయ

4) ప్రమోద్‌ కాలే

సమాధానం: 1

Q. భారతదేశ మొట్టమొదటి ప్రయోగాత్మక రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాన్ని కింది ఏ సంవత్సరంలో ప్రయోగించారు? (జెఎస్‌ఎస్‌సీ జేఈ, 2022)

1) 1981        2) 1978

3) 1979        4) 1980

సమాధానం: 3

Q. Name India's first dedicated navigation satellite:(Kerala PSC Civil Excise Officier Men, 2014)

1) IRS-1A

2) IRS-1B

3) IRNSS-1B

4) IRNSS-1A

Answer: 4

Q. Which was the first Indian remote sensing satellite?(Bihar STET PGT (Geography), 2023)

1) SEO-II

2) Bhaskara-I

3) Chandrayan-III

4) Aryabhatt-I

Answer: 2


Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram