ఛత్రపతి శివాజీ మహరాజ్‌

ఛత్రపతి శివాజీ మహరాజ్‌

మధ్యయుగ భారతదేశ చరిత్రలో శివాజీ మహరాజ్‌ది ప్రముఖ స్థానం. మొగలులను దీటుగా ఎదుర్కొని వారిపై పోరాటాన్ని సాగించిన ధీశాలి శివాజీ. ఈయన పశ్చిమ భారతదేశంలోని మరాఠా రాజ్యాన్ని స్థాపించాడు. గొప్ప విజేత, మంచి పరిపాలనా దక్షుడిగా పేరొందారు. ఆత్మస్థైర్యం, పట్టుదల, ధైర్యసాహసాలతో తన అధికారాన్ని విస్తృతం చేసుకున్నాడు. శివాజీ రాజ్యం పేరు ‘స్వరాజ్య’. ఈయన ప్రధాన లక్ష్యం హిందూ ధర్మ పరిరక్షణ. ఈయన హయాంలో మరాఠాల ప్రభ ఉన్నత స్థితికి చేరింది. ఈయన పోరాట పటిమ, లక్ష్య సాధన నేటికీ అందరి భారతీయుల్లో స్ఫూర్తిని నింపుతూనే ఉంది. ఏప్రిల్‌ 3న శివాజీ వర్ధంతి సందర్భంగా పోటీపరీక్షల కోణంలో ఆయన గురించి ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!

తొలి జీవితం

  • శివాజీ క్రీ.శ.1627, ఫిబ్రవరి 19న పుణెలోని శివనేర్‌ కోటలో జన్మించాడు. ఈయన మరాఠాల్లోని భోంస్లే తెగకు చెందినవాడు. తల్లిదండ్రులు జిజియాబాయి, షాజీ భోంస్లే.
  • తండ్రి అహ్మద్‌నగర్, బీజాపూర్‌ సుల్తాన్‌ల వద్ద పనిచేసి, వారి నుంచి జాగీరు పొందారు. చిన్నతనంలో తల్లి జిజియాబాయి చెప్పిన సాహసగాథలు శివాజీని ఎంతగానో ప్రభావితం చేశాయి.
  • శివాజీకి కొంత వయసు వచ్చాక దాదాజీ కొండదేవ్‌ (దాదాజీ ఖాందియో) వద్ద శిష్యుడిగా చేరాడు. అతడు శివాజీని యోధుడిగా, పరిపాలనాదక్షుడిగా తీర్చిదిద్దాడు. ఈయన్ను  శివాజీ రాజకీయ గురువుగా/ సంరక్షకుడిగా పేర్కొంటారు.
  • మత గురువైన గురురామ్‌దాస్‌ (సమర్థ రామదాసు) బోధనల ద్వారా శివాజీ ఆధ్యాత్మిక, శరణాగత లక్షణాలను పెంపొందించుకున్నారు. ఈయన్ను శివాజీ తన ఆధ్యాత్మిక గురువుగా పేర్కొన్నాడు.
  • మావళీలు అనే కొండ జాతివారితో  స్నేహం చేసిన శివాజీ, వారి నుంచి గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్నాడు.
  • ఆ సమయంలో మరాఠా ప్రాంతం ముస్లిం సుల్తాన్‌ల పాలనలో ఉండేది. వారి హయాంలో హిందువులపై అనేక దాడులు, దౌర్జన్యాలు జరిగాయి. ఇవి శివాజీని ప్రభావితం చేశాయి. మహారాష్ట్రులందరినీ ఒక జాతిగా రూపొందించి, ముస్లిం పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించాలని భావించాడు. ఫలితంగా నాటి బీజాపూర్‌ సుల్తాన్‌ను, మొగల్‌ చక్రవర్తిని ఎదిరించి స్వరాజ్య స్థాపనకు పూనుకున్నాడు.

మొగలులతో వైరం..

  • శివాజీ మొదట్లో మొగలులతో పొత్తు పెట్టుకున్నా తర్వాత 1657లో వారి భూభాగాలపై దాడి చేశారు. దీంతో రెండు రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగాయి.
  • చాకన్‌ యుద్ధం: 1660లో మహారాష్ట్రలోని చాకన్‌ వద్ద షయిస్తాఖాన్‌ నేతృత్వంలోని మొగల్‌ దళాలకు, ఫిరంగోజీ నర్సాలా నేతృత్వంలోని మరాఠా దళాలకు మధ్య జరిగింది. ఇందులో మరాఠాలు ఓడిపోయారు.
  • సూరత్‌ యుద్ధం: 1664లో శివాజీ మహరాజ్‌ సూరత్‌లోని షయిస్తాఖాన్‌ శిబిరంపై దాడి చేసి, అతడ్ని ఓడించాడు.

శివాజీ పట్టాభిషేకం

  • క్రీ.శ.1674 జూన్‌ 16న శివాజీ రాయ్‌గఢ్‌ను తన రాజధానిగా చేసుకుని ఎంతో వైభవంగా పట్టాభిషేకాన్ని జరిపించుకున్నాడు. అప్పుడే శివాజీకి ‘ఛత్రపతి’ అనే బిరుదు వచ్చింది.
  • శివాజీ ఆరేళ్లు పాలించి తన 53వ ఏట 1680, ఏప్రిల్‌ 3న రాయ్‌గఢ్‌లో మరణించాడు. ఇతడి సమాధి రాయ్‌గఢ్‌ కోటలో ఉంది.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. శివాజీ స్థాపించిన హిందూ రాజ్యం పేరు?

(ఎస్‌ఎస్‌సీ హెచ్‌ఎస్‌సీ, 2019)

1) స్వరాజ్య            2) సంక్షేమరాజ్య

3) ధర్మరాజ్యం        4) విజయరాజ్య

సమాధానం: 1

2. శివాజీ పట్టాభిషేకం ఎక్కడ జరిగింది?

(కేరళ పీఎస్సీ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, 2018)

1) పురంధర్‌            2) రాయ్‌గఢ్‌

3) బీజాపూర్‌             4) పుణె

సమాధానం: 2

3. When did Shivaji had his Chhatrapati title?
(CG TET 2017)

1) 1680 AD           2) 1674 AD

3) 1665 AD           4) 1657 AD

Ans: 2

4. Chhatrapati Shivaji established the Maratha Empire in the Deccan during the _______ century AD.
(DSSSB TGT Hindi, 2018)

1) 17th              2) 16th        3) 18th              4) 15th

Ans: 1

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram