ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2026, జులై 31న దిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రూ.4,41,209 కోట్ల విలువైన పథకాలకు ఆమోద ముద్ర వేసింది. అర్హులైన రైతులకు ఏటా రూ.6 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించే పీఎం కిసాన్ పథకాన్ని మరో అయిదేళ్లు పొడిగించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.3,15,614 కోట్లు వ్యయం చేయనుంది.
జల వనరులపై సౌర ఫలకాలు ఏర్పాటుచేసి భారీగా విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ‘ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన (పీఎం ఎస్ఎస్వై) పేరుతో కొత్త పథకాన్ని క్యాబినెట్ ప్రకటించింది. దానికోసం రూ.5,070 కోట్లు కేటాయించింది.
దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచడానికి రూ.84,084 కోట్లతో సముద్ర మంథన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. క్రీడలను ప్రోత్సహించేందుకు ఖేలో ఇండియా స్కీం, జాతీయ క్రీడా ఫెడరేషన్ల ప్రోత్సాహ పథకాల కోసం రూ.36,441 కోట్లు ఖర్చుచేయాలని నిర్ణయించింది.