ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

అన్నా మణి

ఈమె భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక, వాతావరణ శాస్త్రవేత్త. వాతావరణ రంగంపై అనేక పరిశోధనలు చేశారు.


ఈమె భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక, వాతావరణ శాస్త్రవేత్త. వాతావరణ రంగంపై అనేక పరిశోధనలు చేశారు. ముఖ్యంగా సౌర వికిరణం, ఓజోన్, పవన శక్తి లాంటివి ఇందులో ఉన్నాయి. వాతావరణ పరికరాలు (meteorological instrumentation) అభివృద్ధి చేశారు. వర్షాలు, తుపానుల ముందస్తు అంచనాకు ఇవి ఎంతగానో తోడ్పాటు అందించాయి. ఈ కారణాలతోనే ఆమెను ‘వెదర్‌ విమెన్‌ ఆఫ్‌ ఇండియా’/ ‘మదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ వెదర్‌ ఫోర్‌కాస్ట్‌’గా పిలుస్తారు. భారత వాతావరణ శాఖ అభివృద్ధికీ ఈమె ఎంతగానో కృషి చేశారు. భారత తొలితరం శాస్త్రవేత్తల్లో ఒకరైన అన్నా మణి జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

బాల్యం - వృత్తి జీవితం

అన్నా మణి 1918, ఆగస్టు 23న కేరళలోని పీరుమేడులో సిరియన్‌ క్రిస్టియన్‌ కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే ఆమెకు పుస్తకాలు చదవడం అంటే విపరీతమైన ఇష్టం. ఎంతలా అంటే.. తన ఎనిమిదో పుట్టిన రోజున తల్లిదండ్రులు డైమండ్‌ రింగ్స్‌ బహుమతిగా ఇస్తే, అవి వద్దని..  ‘ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (Encycloaedia Britannica)’ కావాలని గొడవ చేసేంత. 12 ఏళ్లకు స్థానిక లైబ్రరీలోని పుస్తకాలన్నీ చదివారు.

  • ఆమె పాఠశాల విద్యను త్రివేండ్రం (ప్రస్తుత తిరువనంతపురం)లోని ‘హిస్‌ హైనెస్‌ ది మహారాజా స్కూల్‌ ఫర్‌ గర్ల్స్‌’, ఆల్వేలోని ‘క్రైస్తవ మహిళాలయం హైస్కూల్‌ ఫర్‌ గర్ల్స్‌’లో పూర్తి చేశారు.
  • నాటి సామాజిక పరిస్థితులు, వీరి కుటుంబ సంప్రదాయం ప్రకారం అమ్మాయిలను ఉన్నత చదువులకు అంగీకరించకుండా పెళ్లికి పరిమితం చేసేవారు. కానీ అన్నా మణి ఆ కట్టుబాట్లను పక్కనపెట్టి కుటుంబాన్ని ఎదిరించి ఉన్నత విద్యను అభ్యసించారు.
  • ఇంటర్మీడియట్‌ విద్యను మద్రాస్‌లోని ఉమెన్స్‌ క్రిస్టియన్‌ కాలేజీలో పూర్తి చేశారు. 1939లో మద్రాస్‌ ప్రెసిడెన్సీ కళాశాల నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీలో బీఎస్సీ ఆనర్స్‌ డిగ్రీతో పట్టభద్రురాలయ్యారు. అక్కడ ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త పరమేశ్వరన్‌ హరిహరన్‌ అధ్యాపకులుగా ఉండేవారు. ఆయన ఇంటర్‌ ఫరోమెట్రీ, హాలోగ్రఫీలో నిష్ణాతులు. హరిహరన్‌ నుంచి అనేక విషయాలను అన్నా మణి తెలుసుకున్నారు.
  • 1940లో ఆమె బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ)లో రిసెర్చ్‌ స్కాలర్‌గా చేరారు. అక్కడ సర్‌ సీవీ రామన్‌తో కలిసి వజ్రాలు, రూబీల స్పెక్ట్రోస్కోపీపై పరిశోధనలు చేశారు. 1945 వరకు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో ఆమె అయిదు పరిశోధన పత్రాలు ప్రచురించారు. వీటి ద్వారా పీహెచ్‌డీ పొందేందుకు మద్రాస్‌ విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఫిజిక్స్‌లో మాస్టర్‌ డిగ్రీ లేకపోవడంతో ఆమెకు డాక్టరేట్‌ దక్కలేదు. ఐఐఎస్‌సీలో ఉన్నప్పుడే ఆమెకు వాతావరణ విషయాల పట్ల ఆసక్తి కలిగింది. ఆ రంగంలో పరిశోధనలు చేయాలని భావించారు. 
  • 1945, ఆగస్టులో లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీలో ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు ఆమెకు ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ లభించింది. అక్కడ ఆమె వాతావరణం, పరికరాల గురించి అధ్యయనం చేశారు. బ్రిటిష్‌ వాతావరణ కార్యాలయంలో శిక్షణ పొందారు. 1948 వరకు ఆమె ఇంగ్లండ్‌లో ఉన్నారు. ఆ సమయంలో టెడ్డింగ్టన్‌లోని నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీతో సహా, వివిధ వాతావరణ కేంద్రాలకు వెళ్లారు. పరికరాల క్రమాంకం (instrument calibration), ప్రామాణీకరణ, తయారీ గురించి తెలుసుకున్నారు.

వాతావరణ రంగానికి చేసిన కృషి

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక కూడా సాధారణ శాస్త్రీయ పరికరాల కోసం ఇతర దేశాలపైనే ఆధారపడేది. ఈ పరిస్థితిని మార్చి, శాస్త్రీయ రంగంలో భారత్‌ను స్వావలంబన సాధించేలా  చేయాలని అన్నా మణి సంకల్పించారు. ఫలితంగా 100 కంటే ఎక్కువ వాతావరణ పరికరాలకు ఆమె రూపకల్పన చేశారు. వీటిలో పైరనో మీటర్లు, విండ్‌ స్పీడ్‌ ట్రాకర్లు, రేడియేషన్‌ను కొలిచే పరికరాలు ఉన్నాయి. బారోమీటర్లు, థర్మామీటర్లు లాంటి విభిన్న వాతావరణ పరికరాల ప్రామాణీకరణకు నాయకత్వం వహించారు.

  • ఐఎండీలో పనిచేస్తోన్న కాలంలో (1957-58) సౌర వికిరణం, గాలి వేగాన్ని కొలిచేందుకు దేశవ్యాప్తంగా స్టేషన్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. నేటికీ భారతదేశ పునరుత్పాదక ఇంధన ప్రయత్నాలకు ఇవే సమాచారాన్ని అందిస్తున్నాయి.
  • 1963లో తుంబా రాకెట్‌ ప్రయోగ కేంద్రంలో అన్నా మణి వాతావరణ అబ్జర్వేటరీ కేంద్రాన్ని, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టవర్‌ను ఏర్పాటు చేశారు. 

పురస్కారాలు - గౌరవాలు

ఈమె ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ), ఇండియన్‌ నేషన్‌ సైన్స్‌ అకాడమీ, అమెరికన్‌ మెటియోరోలాజికల్‌ సొసైటీ, ఇంటర్నేషనల్‌ సొలార్‌ ఎనర్జీ సొసైటీ, ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ మెటియోరోలజీ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ ఫిజిక్స్‌ లాంటి శాస్త్రీయ సంఘాల్లో సభ్యురాలిగా ఉన్నారు.

  • 1975లో ఆమె ఈజిప్ట్‌లో డబ్ల్యూఎంఓకు కన్సల్టెంట్‌గా పనిచేశారు.
  • 1987లో మణికి ఐఎన్‌ఎస్‌ఏ కేఆర్‌ రామనాధన్‌ పతకం లభించింది. దీన్ని ఇండియన్‌ సైన్స్‌ అకాడమీ ప్రదానం చేస్తుంది.

రచించిన పుస్తకాలు

అన్నా మణి మూడు పుస్తకాలను రచించారు. భారతదేశ వాతావరణశాస్త్ర అధ్యయనంలో అవి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నాయి. అవి:

  • ది హ్యాండ్‌బుక్‌ ఫర్‌ సోలార్‌ రేడియేషన్‌ డేటా ఫర్‌ ఇండియా (1980)
  • సోలార్‌ రేడియేషన్‌ ఓవర్‌ ఇండియా (1981)
  • విండ్‌ ఎనర్జీ రిసోర్స్‌ సర్వే ఇన్‌ ఇండియా (1992)

చివరగా..

నాటి సమాజంలోని కట్టుబాట్లను ఎదిరించి, చదువుపై ఉన్న మక్కువతో ఉన్నత విద్యను అభ్యసించిన ధీశాలి అన్నా మణి. తన ఆవిష్కరణలతో దేశ స్వావలంబనకు కృషి చేశారు. భారత వాతావరణ విభాగం అభివృద్ధికి అన్నా మణి ఎంతగానో తోడ్పడ్డారు. కేవలం విద్య, విజ్ఞాన సముపార్జన; వాతావరణశాస్త్ర అభివృద్ధిపైనే దృష్టి సారించిన ఆమె వివాహానికి దూరంగా ఉన్నారు. గాంధేయవాది అయిన ఆమె మహాత్ముడి వైకోమ్‌ సత్యాగ్రహం నుంచి పొందిన స్ఫూర్తితో కేవలం ఖాదీ వస్త్రాలను మాత్రమే ధరించేవారు. అన్నా మణి 2001, ఆగస్టు 16న తిరువనంతపురంలో మరణించారు. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

Q: ‘వెదర్‌ విమెన్‌ ఆఫ్‌ ఇండియా’ అని కింది ఎవరిని పిలుస్తారు? (ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2022)

1) అన్నా మణి                      2) వి.శాంతా

3) అదితి పంత్‌                    4) టెస్సీ థామస్‌

సమాధానం: 1

Q: అన్నా మణి భారతదేశ మొట్టమొదటి ‘ఓజోన్‌సోండే బెలూన్‌’ను కింది ఏ సంవత్సరంలో ఆవిష్కరించారు? (యూపీ టీజీటీ బయాలజీ, 2013)

1) 1962              2) 1963              3) 1964                4) 1965

సమాధానం: 3

Q: అన్నా మణి కింది ఏ రాష్ట్రంలో జన్మించారు? (ఆర్‌ఎస్‌ఎంఎస్‌ఎస్‌బీ అగ్రికల్చర్‌ సూపర్‌వైజర్, 2021)

1) తమిళనాడు            2) ఉత్తర్‌ ప్రదేశ్‌

3) కేరళ                4) మహారాష్ట్ర

సమాధానం: 3


Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram