జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ)

జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ)

జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అనేది భారతదేశంలో భౌగోళికశాస్త్ర కార్యకలాపాలు నిర్వహించే శాస్త్రీయ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన భౌగోళిక సంస్థల్లో ఒకటిగా జీఎస్‌ఐ గుర్తింపు పొందింది. ఖనిజ వనరులను అన్వేషించడం, ఆర్థికాభివృద్ధి - పర్యావరణ నిర్వహణ, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన భౌగోళిక శాస్త్రీయ సమాచారాన్ని రూపొందించడంపై ఇది పనిచేస్తుంది. ప్రభుత్వం, ప్రజలు, వ్యాపార పరిశ్రమలకు ఈ డేటా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పోటీపరీక్షల కోణంలో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) గురించి ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!

ఏర్పాటు

  • భారత్‌లో బొగ్గు, ఖనిజ వనరుల పరిశోధన కోసం ఈస్టిండియా కంపెనీ 1837లో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జాన్‌ మెక్లెలాండ్‌ (John McClelland) దీనికి కార్యదర్శిగా ఉన్నారు. 1846లో ఈస్టిండియా కంపెనీ మొదటి భౌగోళిక సర్వేయర్‌గా హెచ్‌ విలియమ్స్‌ను నియమించింది
  • ఆ కాలంలో బొగ్గుతో నడిచే రైళ్లు మాత్రమే ఉండేవి. రైల్వే కోసం బొగ్గు నిక్షేపాలు కనుక్కునేందుకు జీఎస్‌ఐను ఏర్పాటు చేశారు. 1851, మార్చి 4న ఇది ఉనికిలోకి వచ్చింది
  • మొదట్లో బొగ్గు నిక్షేపాలను కనుక్కోవడంపైనే దృష్టి సారించిన ఈ సంస్థ తర్వాతి కాలంలో దేశవ్యాప్తంగా అన్ని రకాల ఖనిజ వనరుల అన్వేషణ, మ్యాపింగ్‌ చేసింది.

విధులు

  • దేశవ్యాప్తంగా భౌగోళిక సమాచారాన్ని, ఖనిజ వనరుల అంచనాలను రూపొందించడం, నవీనీకరించడం లక్ష్యంగా జీఎస్‌ఐ పనిచేస్తుంది. దీని ప్రధాన విధులను పరిశీలిస్తే..
  • భూభాగం, వైమానిక, సముద్ర సర్వేలు నిర్వహించి మ్యాపింగ్‌ చేయడం.
  • ఖనిజ, శక్తి, నీటివనరులను శాస్త్రీయంగా అంచనా వేయడం.
  • భూకంపాలు, హిమనీ నదాల తరుగుదల, వాతావరణ మార్పు లాంటి అంశాలపై పరిశోధనలు నిర్వహించడం.
  • మౌలిక సదుపాయాల ప్రణాళిక, భూమి స్థిరత్వం, భూగర్భ జలాలు, పర్యావరణ అంచనాలకు మద్దతు ఇచ్చేందుకు భూ సాంకేతిక, పర్యావరణ అధ్యయనాలు చేయడం
  • ప్రాదేశిక డేటాబేస్‌లు, రిమోట్‌ సెన్సింగ్‌ రికార్డులు, జియోలాజికల్‌ ఆర్కైవ్స్, సమాచార నివేదికలు నిర్వహించడం
  • ఖనిజ అన్వేషణ, వనరుల నిర్వహణ, శాస్త్రీయ సలహా మద్దతు కోసం కేంద్ర, రాష్ట్ర సంస్థలతో సమన్వయాన్ని ఏర్పర్చుకోవడం
  • విద్యాసంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుని విద్యార్థుల్లో జియోసైన్స్‌ పట్ల ప్రాచుర్యం కలిగించడం.

ముఖ్యాంశాలు

  • 1899లో జీఎస్‌ఐకి చెందిన రిచర్డ్‌ డిక్సన్‌ బోల్డ్‌హోమ్‌ అస్సాం భూకంపం (1897)పై అధ్యయనం చేసి, మూడు విభిన్న రకాల భూకంప తరంగాలను గుర్తించారు. భూమి అంతర్భాగాన్ని అర్థం చేసుకోవడంలో ఇది ఎంతగానో ఉపయోగపడింది
  • జాతీయ జియోసైన్స్‌ డేటాను ఏకీకృతం చేయడానికి 2023, డిసెంబరు 19న నేషనల్‌ జియోసైన్స్‌ డేటా రిపోజిటరీ (ఎన్‌జీడీఆర్‌) పోర్టల్‌ను ప్రారంభించారు.
  • అరుదైన భూమి మూలకాలు, లిథియం, పొటాషియం, టంగ్‌స్టన్, గ్రాఫైట్‌ మొదలైన కీలక, వ్యూహాత్మక ఖనిజాలపై అనేక ప్రాజెక్టులతో సహా 2024-25లో సుమారు 448 ఖనిజ అన్వేషణ ప్రాజెక్టులు చేపట్టింది.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021)

1) భోపాల్‌    2) అహ్మదాబాద్‌        3) ముంబయి   4) కోల్‌కతా

సమాధానం: 4

2. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఎప్పుడు ఏర్పాటైంది?(యూపీఆర్‌వీయూఎన్‌ఎల్‌ స్టాఫ్‌ నర్స్, 2021)

1) 1851        2) 1951         3) 1871        4) 1931

సమాధానం: 1

3. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా కింది ఏ సంవత్సరంలో మొదటిసారి దేశంలోని భూకంప జోనింగ్‌ మ్యాప్‌ను ప్రచురించింది?(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2025)

1) 1932        2) 1935         3) 1935        4) 1940

సమాధానం: 2

4. The Geological Survey of India (GSI) was established in 1851 primarily to explore coal reserves for ________. (Delhi Police Constable (Executive), 2023)

1) Export to Japan             2) Sea Transport

3) Railway                  4) Textile Mill

Answer: 3

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram