రామకృష్ణ పరమహంస

రామకృష్ణ పరమహంస

భారతదేశంలో 19, 20వ శతాబ్దాల్లో జరిగిన సాంఘిక, మత సంస్కరణోద్యమాల వల్ల సమాజంలో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అవి ప్రజల జీవన విధానంపై ఎంతో ప్రభావం చూపాయి. దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాందిగా ఆ ఉద్యమాలు నిలిచాయి. ముఖ్యంగా హిందూ మతాన్ని, హిందువులు పాటించే విశ్వాసాలను ఆధునికంగా, ఆధ్యాత్మికంగా మార్చాయి. ఈ ఉద్యమ వ్యాప్తికి ప్రముఖంగా కృషి చేసిన వారిలో రామకృష్ణ పరమహంస ఒకరు. ఆయన తన ప్రవచనాల ద్వారా హిందూ మతతత్వాన్ని ప్రబోధించారు. పాశ్చాత్య నాగరికత, నాస్తిక భావాల ప్రభావం నుంచి భారతదేశాన్ని కాపాడటమే లక్ష్యంగా పనిచేశారు. ఫిబ్రవరి 18న రామకృష్ణ పరమహంస జయంతి సందర్భంగా పోటీపరీక్షల కోణంలో ఆయన జీవితంలోని ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!

బాల్యం

  • రామకృష్ణ పరమహంస 1836, ఫిబ్రవరి 18న పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఉన్న కామర్‌పుకుర్‌లో జన్మించారు. అసలు పేరు గదాధర చటోపాధ్యాయ.
  • కామర్‌పుకుర్‌లోని పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించిన ఆయనకు చదువంటే ఇష్టం ఉండేది కాదు. ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం, పురాణాలు - ఇతిహాసాలు నేర్చుకోవడంపై ఎక్కువ ఆసక్తి కనబరిచారు
  • మేధోపరమైన జ్ఞానాన్ని సంపాదించడం కంటే దేవుడ్ని ప్రత్యక్షంగా చూడాలనేదే ఆయన లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. సాధువులు, సన్యాసుల వద్దే నిరంతరం గడుపుతూ వారి నుంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందారు.
  • తొమ్మిదేళ్ల వయసులో ఉపనయనం పూర్తి చేసుకుని, ఆచారబద్ధంగా పూజలు చేయడానికి అర్హత పొందారు. అప్పటి నుంచి గంటల తరబడి దైవారాధనకే కేటాయించారు. అన్ని ప్రాణుల పట్ల దయ, ప్రేమతో ఉండేవారు.
  • 1843లో గదాధర తండ్రి ఖుదీరామ్‌ చటోపాధ్యాయ మరణించారు. దీంతో కుటుంబం ఆర్థిక పరిస్థితి దిగజారి, సోదరుడు రామ్‌కుమార్‌ చటోపాధ్యాయపై ఆ భారం పడింది. ఆయనకు చేదోడుగా ఉండేందుకు గదాధర 1852లో రామ్‌కుమార్‌తో కలిసి కలకత్తా వెళ్లారు
  • దక్షిణేశ్వర్‌లో రాసమణీదేవి నిర్మించిన కాళిమాత ఆలయంలో ఇద్దరూ అర్చకులుగా చేరారు. సోదరుడి మరణానంతరం 1855లో గదాధర ఆ ఆలయానికి ప్రధాన పూజారి అయ్యారు. అప్పటికే ఆయన గొప్ప ఆధ్యాత్మికవేత్తగా పేరుగాంచారు. ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటూ, కాళిమాతను ప్రత్యక్ష దర్శనం చేసుకోవాలని ఆరాధించేవారు. 

గదాధర నుంచి రామకృష్ణ పరమహంస

  • 1864లో తోతాపురి అనే సాధువు దక్షిణేశ్వర్‌ కాళిమాత ఆలయానికి వచ్చారు. ఆయన గదాధర ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని గుర్తించి, సన్యాస దీక్ష ఇచ్చారు. అప్పుడే ఆయన పేరును ‘రామకృష్ణ పరమహంస’గా మార్చారు. తోతాపురి ఆయనకు అద్వైతాన్ని బోధించారు. తర్వాత ఆయన హిందూమతంలోని వివిధ ఆచారాలు, ఇతర మతాల్లోని పద్ధతులను తెలుసుకోవడం ప్రారంభించారు.

రామకృష్ణ బోధనలు

  • రామకృష్ణ పరమహంస తన బోధనల ద్వారా నాటి సమాజంలోని పరిస్థితులను ఎంతగానో ప్రభావితం చేశారు. ముఖ్యంగా అన్ని మతాల సారాంశం ఒక్కటే అని, అందరూ ఆధ్యాత్మిక జీవనాన్ని సాగించాలని ఆయన చెప్పేవారు.
  • దేవుడ్ని చేరడానికి ఉన్న వేర్వేరు మార్గాలే మతాలు అని పేర్కొన్నారు.
  • ఇతర మనుషులకు, ప్రాణులకు సేవ చేయడమే దేవుడికి చేసే సేవ అని ఆయన బోధించారు
  • కోర్కెలు త్యజించి సత్ప్రవర్తనతో మోక్షం సాధించవచ్చని పేర్కొన్నారు. నిష్కల్మష భక్తితో ధ్యానిస్తే దేవుడి సాక్షాత్కారం లభిస్తుందని బోధించారు
  • రామకృష్ణ పరమహంస ముఖ్య శిష్యుడు వివేకానందుడు. ఆయన తన గురువు బోధనలను విశ్వవ్యాప్తం చేసే లక్ష్యంతో 1897లో కలకత్తాలోని బేలూర్‌లో రామకృష్ణ మిషన్‌ను స్థాపించారు. ‘మానవ సేవే మాధవ సేవ’ అనే రామకృష్ణ పరమహంస సందేశమే రామకృష్ణ మిషన్‌ నినాదం.

చివరగా..

  • రామకృష్ణ పరమహంస సాంఘిక, మత సంస్కరణలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నాటి సమాజంలో మతం పేరిట జరుగుతోన్న అకృత్యాలను అరికట్టి, ప్రజలు సన్మార్గంలో నడిచేలా తన వంతు కృషి చేశారు. అన్ని మతాల సారాంశాలు స్వయంగా తెలుసుకుని, అన్ని మార్గాలు దేవుడ్ని చేరుకోవడానికే అని విశ్వసించారు. వర్ణ వ్యవస్థను, కులపరమైన విభేదాలను ఖండిస్తూ సహపంక్తి భోజనాలను ప్రవేశపెట్టారు. ఆయన 1886, ఆగస్టు 16న కాశీపూర్‌లో మరణించారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్‌ను ఎప్పుడు స్థాపించారు?(ఎస్‌ఎస్‌సీ, సీహెచ్‌ఎస్‌ఎల్‌ 2021)

1) 1897    2) 1899        3) 1882    4) 1876

సమాధానం: 1

2. కింది వారిలో ఎవరు రామకృష్ణ పరమహంస ముఖ్య శిష్యుడిగా పేరొందారు?(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2023)

1) స్వామి దయానంద్‌            2) స్వామి సహజానంద

3) స్వామి వివేకానంద            4) స్వామి శ్రద్ధానంద

సమాధానం: 3

3. రామకృష్ణ పరమహంస అసలు పేరు ఏమిటి?(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2023)

1) నరేంద్రనాథ్‌ దత్తా        2) ముకుందలాల్‌ ఘోష్‌

3) గదాధర చటోపాధ్యాయ    4) వెంకటరామన్‌ అయ్యర్‌

సమాధానం: 3

4. The name of the Brahmin priest who later came to be known as Ramakrishna Paramahansa is:(SSC CHSL, 2023)

1) Gadadhar Chattopadhyaya

2) Dayanand Saraswati

3) Shree Narayana Guru

4) Narendra Nath Datta

Answer: 1

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram