బ్రిటిష్‌ కాలంలో రైతు తిరుగుబాట్లు

బ్రిటిష్‌ కాలంలో రైతు తిరుగుబాట్లు

భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన ఆంగ్లేయులు ఇక్కడి రాజకీయ అనైక్యతను ఆసరాగా చేసుకుని దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రజలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, మతపరంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. వీరి హయాంలో గ్రామీణ భారతదేశం తీవ్ర ప్రభావానికి గురైంది. వ్యవసాయ రంగంలో కొత్తగా భూమి శిస్తు విధానాలు అమలు చేశారు. వాణిజ్య పంటలకు ప్రాధాన్యం ఇవ్వడం, అధిక వడ్డీరేట్లు లాంటివి రైతులను కుంగదీశాయి. వారు జమీందార్లు, వడ్డీ వ్యాపారుల చేతుల్లో అణచివేతకు, దోపిడీకి గురయ్యారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా రైతులు తిరుగుబాట్లు చేశారు. ఇవి దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో జరిగాయి. పోటీపరీక్షల కోణంలో ఈ ఉద్యమాలకు సంబంధించిన ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!

సన్యాసి తిరుగుబాటు

  • 18వ శతాబ్దం చివర్లో బెంగాల్‌లో జరిగిన ముఖ్యమైన తిరుగుబాటు. ముర్షిదాబాద్, వైకుంఠపుర్‌ అడవుల్లో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ప్రారంభమైంది. అక్కడి సన్యాసులు, సాధువులు పాల్గొన్నారు.

కారణాలు:

  • హిందూ, ముస్లింల పవిత్ర స్థలాలను సందర్శించే యాత్రికులపై 1770, ఏప్రిల్‌లో బ్రిటిష్‌ వారు ఆంక్షలు విధించడం
  • 1770లో బెంగాల్‌లో విపరీతమైన కరవు సమయంలోనూ ఆంగ్లేయులు ప్రజల నుంచి పన్ను వసూలు చేయడం.

నాయకత్వం వహించింది: 

  • జల్పాయిగురి (ప్రస్తుత పశ్చిమ్‌ బంగా)కి చెందిన పండిట్‌ భవానీ చరణ్‌ పాఠక్‌.

పాగల్‌ పంథీ

  • ఇది 1825-35 కాలంలో సాగింది. పాగల్‌ పంథీ అనేది ఒక మతపరమైన సంస్థ. దీన్ని 19వ శతాబ్దంలో బెంగాల్‌ ప్రావిన్స్‌లోని ఉత్తర మెమన్సింగ్, షేర్పూర్‌ జిల్లా ప్రాంతాల్లో కరీం షా ఏర్పాటు చేశాడు. ఇతడి మరణం తర్వాత కొడుకైన టిప్పు షా పాగల్‌ పంథీ బాధ్యతలు స్వీకరించాడు.

తిరుగుబాటుకు కారణం

  • జమీందార్లు ఎక్కువ మొత్తంలో రైతుల నుంచి పన్నులు వసూలు చేయడం. సుంకం కట్టని వారి ఆస్తులు జప్తు చేయడం.

రంగాపూర్‌ రైతుల తిరుగుబాటు

  • 1783 జనవరి 18న బెంగాల్‌లోని రంగాపూర్, దినాజ్‌పుర్‌ జిల్లాల్లోని రైతులు, జమీందార్లు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ఈ తిరుగుబాటు చేశారు
  • కేనా సర్కార్‌ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు.

కారణాలు:

  • రైతులు, జమీందార్ల నుంచి ఎక్కువ మొత్తంలో పన్నులు వసూలు చేయాలనే ఉద్దేశంతో బ్రిటిష్‌ వారు ‘ఇజారాదారి పన్ను’ విధానాన్ని ప్రవేశపెట్టారు
  • రైతుల కష్టనష్టాలతో సంబంధం లేకుండా పన్ను వసూలు జరిగింది. దీనికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. 

పబ్నా తిరుగుబాటు

  • తూర్పు బెంగాల్‌లోని అనేక జిల్లాల్లోని రైతులు జమీందారులకు వ్యతిరేకంగా 1870-1885 మధ్యకాలంలో తిరుగుబాట్లు చేశారు. ఈ తిరుగుబాట్లకు కేంద్ర బిందువు పబ్నా జిల్లా. అందుకే దీనికి పబ్నా తిరుగుబాటు అని పేరు.

కారణాలు:

  • 1859 చట్టం రైతులకు తాము సాగుచేసే భూమిపై స్వాధీన హక్కులను ఇచ్చింది. తూర్పు బెంగాల్‌లోని శాశ్వత శిస్తు విధానం అమల్లో ఉన్న భూభాగాల్లోని జమీందారులు.. రైతులకు స్వాధీన హక్కులు లేకుండా చేయాలని అనేక రకాలుగా ప్రయత్నించారు. దీంతో తూర్పు బెంగాల్‌లోని అనేక జిల్లాలో రైతులు జమీందారులకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు. 

ఖేదా సత్యాగ్రహం

  • 1918లో గుజరాత్‌లోని ఖేదా ప్రాంతంలో జరిగింది. గాంధీజీ, ఇందులాల్‌ యాజ్ఞిక్, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ ముఖ్య నాయకులు.

కారణం:

  • ఖేదా జిల్లాలో పంటలు పండకపోవడంతో భూమిశిస్తు చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పట్టించుకోకపోవడంతో ఉద్యమించారు.

మోప్లా తిరుగుబాటు

  • 1921లో కేరళలోని మలబార్‌ ప్రాంతంలో జరిగింది. దీన్నే మలబార్‌ తిరుగుబాటు అని కూడా అంటారు.
  • కారణం: మలబార్‌ ప్రాంతంలో మోప్లా ముస్లిం రైతులపై హిందూ అగ్రకులాలకు చెందిన నంబూద్రి, నాయర్‌ భూస్వాములు ఆధిపత్యం చెలాయించేవారు. ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన భూమిశిస్తు విధానం వీరిని మరిన్ని కష్టాలకు గురిచేసింది.
  • జమీందార్లు వీరికి భూమిపై సంక్రమించిన పారంపర్య హక్కును తొలగించి, దాన్ని ఇతరులకు ఇచ్చారు. వారికి ఉన్న కౌలు అధికారాలను కూడా తొలగించారు. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. మోప్లా తిరుగుబాటు కేరళలో ఎప్పుడు జరిగింది?(ఎన్‌టీపీసీ సీబీటీ 1, 2021)

1) 1925    2) 1921     3) 1945    4) 1934

సమాధానం: 2

2. ప్రసిద్ధ నవల ‘ఆనందమఠం’ను మొదట కింది ఏ భాషలో రచించారు?(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2022)

1) బెంగాలీ    2) హిందీ     3) సంస్కృతం  4) ఒడియా

సమాధానం: 1

3. పాగల్‌ పంథీని ఎవరు స్థాపించారు?(బీపీఎస్‌సీ, 2015)

1) బెల్లెష్‌ షా              2) కరమ్‌ షా

3) యుదువేంద్ర సింగ్‌        4) స్వామి సహజానంద

సమాధానం: 2

4. Who is the author of the novel 'Anandamath'?(NTPC CBT 2, 2017),(SSC Graduation Level, 2020)

1) Dinabandhu Mitra             2) Subramania Bharathi

3) Bhartendu Harish Chandra      4) Bankim Chnadra Chattopadhyay

Answer: 4

5. Which of the following statements about the Sanyasi and Faqir disturbances/rebellions are correct?(CDS GK, 2021)

1. Governor - General Warren Hastings faced  the persistent Sanyasi and Faqir disturbances in Bengal and Bihar

2. There were a number of Shaivite Naga Sanyasis who formed into armed bands.

3. Majnu Shah, who led bands into Bengal from 1771, was their prominent leader.
Select the correct answer using the code given below:

1) 1 and 2 only           2) 1, 2 and 3

3) 2 and 3 only           4) 1 and 3 only

Answer: 2

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram