ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ఏర్పాటునకు గుర్తుగా ఏటా అక్టోబరు 16న ‘ప్రపంచ ఆహార దినోత్సవం’గా (World Food Day) నిర్వహిస్తారు. ఆహారం అనేది మనిషి కనీస అవసరం. మానవ ఆరోగ్యానికి, మెరుగైన భవిష్యత్తుకు పౌష్టికాహారం కావాలి. ఆకలి గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించడం; దాని నిర్మూలన - స్థిరమైన ఆహార వ్యవస్థలను నిర్మించే చర్యలను ప్రోత్సహించడం ఈ దినోత్సవ లక్ష్యం. ఆహార భద్రత, పోషకాహార ప్రాముఖ్యత గురించి ప్రజలను చైతన్యపరచడంతోపాటు ఆహార వృథాను అరికట్టడంపై అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
ప్రపంచవ్యాప్తంగా ఆకలిని రూపుమాపి, అందరికీ పౌష్టికాహారంతోపాటు ఆహార భద్రతను కల్పించే లక్ష్యంతో 1945, అక్టోబరు 16న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ఏర్పడింది. ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. 1979, నవంబరులో రోమ్ (ఇటలీ)లో ఎఫ్ఏఓ 20వ సర్వసభ్య సమావేశం జరిగింది. అందులో దీని వ్యవస్థాపక దినోత్సవమైన అక్టోబరు 16న ఏటా ‘ప్రపంచ ఆహార దినోత్సవం’గా జరుపుకోవాలని సభ్య దేశాలు తీర్మానించాయి. 1980లో యూఎన్ జనరల్ అసెంబ్లీ దీన్ని ఆమోదించింది. 1981 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.
2025 నినాదం: "Hand in Hand for Better Foods and a Better Future"