మీరు పదో తరగతి పూర్తి చేసిన బాలికలా? తల్లిదండ్రులకు మీరొక్కరే సంతానమా? అయితే, సీబీఎస్ఈ(CBSE) ప్రకటించిన ఈ మెరిట్ స్కాలర్షిప్(Single Girl Child Scholarship) మీ కోసమే. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉండి ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని చదువుల్లో ప్రోత్సహించేందుకు సీబీఎస్ఈ(CBSE) ఈ ప్రత్యేక స్కాలర్షిప్ని అందిస్తోంది. ఇందులో భాగంగా 2025 సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి పాసై ప్రస్తుతం సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్షిప్ కోసం అక్టోబర్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, గతేడాది ఈ స్కాలర్షిప్నకు ఎంపికైన విద్యార్థినులు రెన్యువల్ చేసుకోవచ్చు. కొత్తగా దరఖాస్తులు, రెన్యువల్ కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ https://www.cbse.gov.in / క్లిక్ చేయండి.
ముఖ్యాంశాలివే..
పదో తరగతి పరీక్షల్లో కనీసం 70శాతం, ఆపైన మార్కులు సాధించిన వారే ఈ స్కాలర్షిప్ అవార్డుకు అర్హులు.
దరఖాస్తు చేసుకొనే విద్యార్థినులు సీబీఎస్ఈలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే, ప్రస్తుతం సీబీఎస్ఈ అనుబంధ పాఠశాల్లో 11, 12వ తరగతులు అభ్యసిస్తుండాలి.
ఈ స్కాలర్షిప్నకు ఎంపికైన విద్యార్థినులకు ప్రతి నెలా ₹1000 చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు. విద్యార్థినికి చెందిన ఖాతాలోనే ఈ మొత్తాన్ని జమ చేస్తారు.
విద్యార్థిని ట్యూషన్ ఫీజు పదో తరగతిలో నెలకు రూ.2500; సీబీఎస్ఈ 11, 12 తరగతులకు రూ.3వేలు మించరాదు.
సీబీఎస్ఈ బోర్డులో విద్యనభ్యసిస్తున్న ఎన్నారై విద్యార్థినులూ ఈ అవార్డుకు అర్హులే. వీరి ట్యూషన్ ఫీజు నెలకు రూ.6వేలు మించకూడద్దు.
ఈ స్కాలర్షిప్నకు ఇప్పటికే ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
11వ తరగతి నుంచి 12వ తరగతికి రెన్యువల్ చేయించుకోవాలంటే సదరు విద్యార్థినులు కనీసం 70శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది.
తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8లక్షల కన్నా తక్కువ ఉండాలి.
ఈ దరఖాస్తుల్ని సంబంధిత పాఠశాలలు అక్టోబర్ 30 నాటికి వెరిఫికేషన్ను పూర్తి చేయాల్సి ఉంటుంది.