దేశంలో పెచ్చరిల్లుతున్న ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు కేంద్ర హోంశాఖ ‘పాలసీ ఫర్ రెస్పాన్స్ ఎగ్నెస్ట్ హోస్టైల్ యాక్టివిటీస్ అండ్ రాడికలిజం (ప్రహార్)’ పేరుతో ప్రత్యేక విధానం రూపొందించింది. ఈమేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలను పంపింది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, పరస్పర సహకారం, ఏదైనా అనూహ్య పరిస్థితి తలెత్తితే తక్షణం చేపట్టాల్సిన చర్యలు వంటివాటిని మార్గదర్శకాల్లో వివరించింది.
శాంతిభద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోనిదే అయినప్పటికీ హద్దుల్లేని ఉగ్రవాదం విషయంలో కలిసికట్టుగా పనిచేయాలన్న ఉద్దేశంతోనే ‘ప్రహార్’ను రూపొందించారు. ఇందులోభాగంగా అన్ని రాష్ట్రాల నిఘావిభాగాలు.. ప్రత్యేకంగా ఉగ్రవాద నిరోధక విభాగాలతో కేంద్ర నిఘావిభాగం నిరంతరం సంప్రదింపులు జరుపుతుంది. ఇందుకోసం ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్వోపీ) కూడా సిద్ధం చేశారు.