ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

ఉపేంద్రనాథ్‌ బ్రహ్మచారి

ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ వైద్యులు, శాస్త్రవేత్త. ట్రాపికల్‌ మెడిసిన్‌ (ఉష్ణమండల వైద్యం)లో అనేక ప్రయోగాలు చేశారు.


ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ వైద్యులు, శాస్త్రవేత్త. ట్రాపికల్‌ మెడిసిన్‌ (ఉష్ణమండల వైద్యం)లో అనేక ప్రయోగాలు చేశారు. ప్రజారోగ్యాన్ని కాపాడే అనేక ఆవిష్కరణలు చేశారు. ముఖ్యంగా పరాన్నజీవి కారణంగా సోకే కాలా-అజార్‌ వ్యాధికి ప్రభావవంత చికిత్స అయిన ‘యూరియా స్టిబమైన్‌’ను కనుక్కున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగింది. దేశవ్యాప్తంగా అనేకమంది ప్రాణాలను కాపాడటంలో ఇది సఫలీకృతమైంది. వైద్యశాస్త్రంలో అనేక పర్యాయాలు ఆయన నోబెల్‌ పురస్కారానికి నామినేట్‌ అయ్యారు. వైద్య రంగంలో ఆయన చేసిన పరిశోధనలు నేటికీ అనేకమందికి మార్గదర్శకం. డిసెంబరు 19న ఉపేంద్రనాథ్‌ బ్రహ్మచారి జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

బాల్యం - విద్యాభ్యాసం  

  • ఉపేంద్రనాథ్‌ బ్రహ్మచారి 1873, డిసెంబరు 19న ప్రస్తుత పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌ జిల్లాలోని సర్దంగా గ్రామంలో జన్మించారు. తండ్రి నీల్మణి బ్రహ్మచారి తూర్పు రైల్వేలో డాక్టర్‌గా పనిచేసేవారు. 
  • పాఠశాల విద్యను బిహార్‌లోని జమాల్‌పూర్‌లో ఉన్న ఈస్టర్న్‌ రైల్వే బాయ్స్‌ హై స్కూల్‌లో పూర్తి చేశారు. చిన్నతనం నుంచే ఆయనకు చదువుపై ఎక్కువ ఆసక్తి ఉండేది. గణితం, రసాయనశాస్త్రం సబ్జెక్టులపై మక్కువ ఎక్కువ.
  • 1893లో హుగ్లీ మొహ్సిన్‌ కాలేజీ నుంచి గణితం, రసాయనశాస్త్రంలో ఆనర్స్‌తో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ డిగ్రీ పొందారు. 
  • కెమిస్ట్రీని మెయిన్‌ సబ్జెక్ట్‌గా ఎంచుకుని ఉన్నత విద్యను కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో అభ్యసించారు. 1894లో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. 
  • ఆనాటి పరిస్థితుల్లో చిన్న వ్యాధులకే సరైన మందులు లేక చాలామంది ప్రజలు మరణించడాన్ని ఉపేంద్రనాథ్‌ గమనించారు. ఇది ఆయన్ను ఎంతగానో కలచి వేసింది. దీంతో ఆయన వైద్యశాస్త్రాన్ని అభ్యసించాలని అనుకున్నారు. కెమిస్ట్రీలో తనకున్న ప్రావీణ్యం ఔషధాల తయారీకి ఉపయోగించాలని భావించారు. ఆ విధంగా ఆయన కలకత్తా మెడికల్‌ కాలేజీలో చేరారు. 1899లో మెడిసిన్, సర్జరీ రెండిటిలోనూ అత్యధిక మార్కులు సాధించారు. ఇందుకుగానూ గూడెవ్, మెక్‌లియోడ్‌ పతకాలు అందుకున్నారు. 
  • 1902లో కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జనరల్‌ హాస్పిటల్‌ నుంచి ఎండీ డిగ్రీ పొందారు. అదే ఏడాది ఢాకా మెడికల్‌ స్కూల్‌లో ఫిజియాలజీ, మెటీరియా మెడికా బోధించే ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు. అక్కడ ఆయన ‘హిమోలిసిస్‌’పై పరిశోధనలు చేశారు. 1904లో ‘స్టడీస్‌ ఇన్‌ హిమోలిసిస్‌’ అనే తన థీసిస్‌తో కలకత్తా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. 

వృత్తి జీవితం..

  • 1905లో ఆయన కోల్‌కతాలోని కాంప్‌బెల్‌ మెడికల్‌ స్కూల్‌ (ప్రస్తుతం నీల్‌ రతన్‌ సిర్కార్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌)లో మెడిసిన్‌ టీచర్, ఫస్ట్‌ ఫిజీషియన్‌గా చేరారు. 1923 వరకు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో మలేరియా, బ్లాక్‌-వాటర్‌ ఫీవర్, సెరెబ్రోస్పానియల్‌ మెనింజైటిస్‌ లాంటి ప్రాణాంతక వ్యాధుల గురించి పరిశోధనలు చేశారు. కోల్‌కతా, ఢాకాలో క్వార్టన్‌ జ్వరం ఉనికిని కనుక్కున్న మొదటి వ్యక్తి ఈయనే. ఈ జ్వరం ఒక అరుదైన రకమైన మలేరియా అని, ప్రతి 72 గంటలకు ఒకసారి పునరావృతం అవుతుందని ఆయన చెప్పారు. 
  • 1923 నుంచి 1927 వరకు కలకత్తా మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 
  • 1924లో కోల్‌కతాలో బ్రహ్మచారి రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేశారు. వ్యాధులపై పరిశోధన, ఔషధ తయారీ మొదలైనవి ఇందులో నిర్వహించారు.
  • 1927లో కోల్‌కతాలోని కార్మైకల్‌ మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా చేరారు. అదే సమయంలో నేషనల్‌ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రాపికల్‌ డిసీజ్‌ వార్డ్‌కు నాయకత్వం వహించారు. 
  • 1939లో కోల్‌కతాలోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌లో బయోకెమిస్ట్రీ విభాగాధిపతిగా, ప్రొఫెసర్‌గా పనిచేశారు. 

యూరియా స్టిబమైన్‌ ఆవిష్కరణ

  • 20వ శతాబ్ద ప్రారంభంలో కాలా-అజార్‌ (విసెరల్‌ లీష్మానియాసిస్‌) వ్యాధి భారతదేశంలో అనేకమంది మరణానికి కారణమైంది. తీవ్రమైన జ్వరం, రక్తహీనత, బరువు తగ్గడం లాంటివి దీని లక్షణాలు. ఇది లీష్మానియా జాతికి చెందిన ప్రోటోజోవన్‌ పరాన్నజీవుల వల్ల సంక్రమిస్తుంది. 1920లో ‘యూరియా స్టిబమైన్‌’ సంశ్లేషణ ద్వారా దీన్ని అరికట్టొచ్చని ఉపేంద్రనాథ్‌ కనుక్కున్నారు. యూరియాను పారా-అమినోఫెనిల్‌ స్టిబ్నిక్‌ ఆమ్లంతో (para-aminophenyl stibnic acid) కలిపి ఈ సమ్మేళనాన్ని తయారు చేశారు. ఈ ఔషధం కాలా-అజార్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంది. 

అవార్డులు - గౌరవాలు

  • 1915లో లండన్‌లోని రాయల్‌ సొసైటీ ఆఫ్‌ మెడిసిన్‌; 1921లో ఆసియాటిక్‌ సొసైటీ ఆఫ్‌ బెంగాల్‌; 1935లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ ఆఫ్‌ ఇండియాకు ఫెలోగా ఎన్నికయ్యారు. 
  • 1921లో కలకత్తా స్కూల్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ నుంచి మింటో మెడల్‌ పొందారు. 
  • 1928-29లో ఆసియాటిక్‌ సొసైటీ ఆఫ్‌ బెంగాల్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు.
  • 1929, 1942లో వైద్యశాస్త్రంలో నోబెల్‌ బహుమతికి నామినేట్‌ అయ్యారు. 
  • 1936లో కోల్‌కతాలోని ఇండియన్‌ కెమికల్‌ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేశారు.

చివరగా

  • ఉపేంద్రనాథ్‌ బ్రహ్మచారి పరిశోధనలు వైద్యశాస్త్రంలో ఎంతోమందికి ప్రేరణగా నిలిచాయి. ఆయన కనిపెట్టిన ‘యూరియా స్టిబమైన్‌’ లక్షలాది ప్రజల ప్రాణాలను నిలబెట్టింది. ఇప్పటికీ ట్రాపికల్‌ డిసీజెస్‌ తగ్గించడంలో ఇది కీలకంగా ఉంది. అయితే వలస రాజ్య పాలన కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు తగిన గుర్తింపు దక్కలేదనేది వాస్తవం. వివిధ సందర్భాల్లో ఆయన నోబెల్‌కు నామినేట్‌ అయినా దక్కకపోవడమే ఇందుకు నిదర్శనం.  ఆయన 1946, ఫిబ్రవరి 6న కోల్‌కతాలో మరణించారు. 

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram