కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) ఇటీవల ‘భారత్లో రోడ్డు ప్రమాదాలు-2024’ వార్షిక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రతి వంద రోడ్డు ప్రమాదాల్లో సగటున 36.3 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు ఇది వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో ‘ప్రమాదాల తీవ్రత (సివియారిటీ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్)’ ఏటా పెరుగుతోందని వివరించింది.
ప్రతి వంద రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్యను ‘ప్రమాదాల తీవ్రత’గా పరిగణిస్తారు. ఇది జాతీయ స్థాయిలో కంటే రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా 2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉండగా, వాటిలో మరణించిన వారి సంఖ్య పరంగా చూస్తే 8వ స్థానంలో ఉంది.
ఈ అంశంలో దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో ఏపీ తొలి స్థానంలో ఉంది. 2021లో రాష్ట్రంలో జరిగిన ప్రతి వంద రోడ్డు ప్రమాదాల్లో సగటున 38 మంది దుర్మరణం పాలవ్వగా.. 2024లో ఆ సంఖ్య 42.7కు ఎగబాకింది.