శాస్త్రీయ విజ్ఞానం మానవుడి జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చింది. రాతి పనిముట్ల నుంచి కృత్రిమ మేధ వినియోగం వరకు సైన్స్ అనేక అద్భుతాలకు కారణమైంది. ప్రాచీన కాలం నుంచే మనదేశంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి జరిగింది. ఎందరో శాస్త్రవేత్తలు తమ మార్గదర్శకత్వంతో భారత్లో శాస్త్రీయ పురోగతికి కృషి చేశారు. వారిలో సి.వి.రామన్ ఒకరు. ఆయన ఆవిష్కరించిన రామన్ ఎఫెక్ట్ భౌతికశాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టినందుకు గుర్తుగా ఏటా మన దేశంలో ఫిబ్రవరి 28న ‘జాతీయ సైన్స్ దినోత్సవం’గా (National Science Day) నిర్వహిస్తారు. సైన్స్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు సమాజ శ్రేయస్సులో దీని పాత్ర, విజయాలను చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
రామన్ ఎఫెక్ట్
- రామన్ ఎఫెక్ట్ అనేది స్పెక్టోస్క్రోపీలో ఒక దృగ్విషయం. అధిక స్థాయుల్లో ఉత్తేజిత అణువుల ద్వారా ఫోటాన్ల పరిక్షేపణగా (Dispersion) దీన్ని నిర్వచిస్తారు. అంటే ఒక కాంతి పుంజం అణువుల ద్వారా విక్షేపం చెందినప్పుడు సంభవించే కాంతి తరంగదైర్ఘ్యంలో మార్పు.
- కాంతి తరంగం ఒక పదార్థం (వాయువు, ద్రవం, ఘనం) మీదుగా ప్రయాణించినప్పుడు, ఆ పదార్థ పరమాణు నిర్మాణంతో సంబంధం కారణంగా దిశ, తరంగదైర్ఘ్యాన్ని మారుస్తుంది. సముద్రపు నీటి రంగు నీలంలో కనిపించడానికి ఇదే కారణం.
- వివిధ పదార్థాల పరమాణు నిర్మాణం ఆధారంగా కాంతి ఎలా మారుతుందో అర్థం చేసుకోవడానికి రామన్ ఎఫెక్ట్ సహాయపడుతోంది.
ఆవిష్కరణ ఇలా..
- సాధారణంగా ఆకాశం, సముద్రం నీలి రంగులో కనిపిస్తాయి. నింగి ప్రతిబింబం కారణంగా కడలికి ఆ రంగు వచ్చిందని అందరూ నమ్మేవారు. 1921లో ఇంగ్లండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ‘కాంగ్రెస్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్’ సమావేశం జరిగింది. కలకత్తా యూనివర్సిటీ తరఫున రామన్ అందులో పాల్గొనేందుకు వెళ్లారు. అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా భారత్కు ప్రయాణించారు. ఆ సమయంలో ఆయన మధ్యధరా సముద్రాన్ని చూస్తూ అందులోని నీరు చాలా గాఢతతో కూడిన నీలం రంగులో ఉండటాన్ని గమనించారు.
- ఆకాశ నీలం కంటే ఇంత ఎక్కువ రంగులో ఉన్నట్లు గుర్తించి, దానిపై పరిశోధన చేయాలనుకున్నారు.
- కాంతి సముద్రపు నీటి మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు దాని పరిక్షేపణ కారణంగా నీలి రంగులో కనిపిస్తుందని నిరూపించారు.
- కాంతి కణాల్లోని ఫోటాన్లు పదార్థాల పరమాణువులపై పడి పరిక్షేపం చెందుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఫోటాన్లు కొన్ని ఎక్కువ పౌనఃపున్యంతో మరికొన్ని తక్కువ పౌనఃపున్యంతో పరిక్షేపం చెందుతాయి.
- సముద్ర నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతిలోని నీలం రంగు ఎక్కువగా పరిక్షేపం చెంది కంటికి చేరడం వల్ల సముద్రం నీలంగా కనిపిస్తుందని రామన్ కనిపెట్టారు.
- ఈ విధంగా పదార్థాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయని తెలిపే పరిశోధన ఫలితమే ‘రామన్ ఎఫెక్ట్’.
సీవీ రామన్
- ఈయన 1888 నవంబరు 7న నాటి మద్రాసు రాష్ట్రం తిరుచిరాపల్లిలో జన్మించారు. పూర్తి పేరు చంద్రశేఖర వెంకట రామన్.
- 1917లో కలకత్తా విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా చేరారు.
- 1926లో ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ను స్థాపించారు. దానికి మొదటి సంపాదకుడిగా వ్యవహరించారు. 1933, ఏప్రిల్లో రామన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) మొదటి భారతీయ డైరెక్టర్గా నియమితులయ్యారు. 1934లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ను ఏర్పాటు చేశారు.
- ‘రామన్ ఎఫెక్ట్’ను కనుక్కున్నందుకుగానూ 1930లో భౌతికశాస్త్రంలో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. ఈయన ఆసియా ఖండం నుంచి నోబెల్ అందుకున్న మొదటి వ్యక్తి.
- రామన్ను భారత ప్రభుత్వం 1954లో భారతరత్నతో సత్కరించింది.
- ఈయన 1970, నవంబరు 21న బెంగళూరులో మరణించారు.
చారిత్రక నేపథ్యం
సి.వి.రామన్ 1928, ఫిబ్రవరి 28న ‘రామన్ ఎఫెక్ట్’ను కనుక్కున్నారు. ఈ పరిశోధన భౌతికశాస్త్రంలో ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. భారతదేశ ఖ్యాతి కూడా విశ్వవ్యాప్తమైంది. శాస్త్రీయ రంగంలో సి.వి.రామన్తోపాటు ఇతర శాస్త్రవేత్తలు సాధించిన విజయాలను గుర్తించే లక్ష్యంతో ఫిబ్రవరి 28న ‘జాతీయ సైన్స్ దినోత్సవం’గా ప్రకటించాలని 1986లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (ఎన్సీఎస్టీసీ) ప్రభుత్వాన్ని కోరింది. దీన్ని భారత ప్రభుత్వం ఆమోదించింది. 1987 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.
గత పరీక్షల్లో అగిడిన ప్రశ్నలు
1. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(కేవీఎస్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, 2023)
1) మార్చి 3 2) జనవరి 21
3) డిసెంబరు 13 4) ఫిబ్రవరి 28
సమాధానం: 4
2. సీవీ రామన్ 1934లో కింది ఏ ప్రాంతంలో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నెలకొల్పారు?
(ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ టైర్ 1, 2023)
1) ముంబయి 2) హైదరాబాద్
3) బెంగళూరు 4) న్యూదిల్లీ
సమాధానం: 3
3. సీవీ రామన్ కింది ఏ సంవత్సరంలో రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నారు?
(డీఎస్ఎస్ఎస్బీ అసిస్టెంట్ సూపరింటెండెంట్, 2024)
1) 1920 2) 1901
3) 1911 4) 1925
సమాధానం: 4