సెంట్రల్‌ ఎక్సైజ్‌ డే

సెంట్రల్‌ ఎక్సైజ్‌ డే

దేశంలో వస్తు ఉత్పత్తుల తయారీ, పంపిణీ, అమ్మకం కోసం విధించే పన్నును ఎక్సైజ్‌ సుంకం అంటారు. ఇది వస్తువుల తయారీదారులు భారత ప్రభుత్వానికి చెల్లించే పరోక్ష పన్ను. దేశంలో తయారైన వస్తువులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చాక విస్తృత శ్రేణి ఎక్సైజ్‌ పన్నులు విలీనమయ్యాయి. అయితే పొగాకు, పెట్రోలియం ఉత్పత్తులు లాంటి కొన్నింటిపై మాత్రమే ఇది కొనసాగుతోంది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) ఈ పన్నుల నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. సకాలంలో పన్ను చెల్లించాల్సిన ఆవశ్యకతను, దేశ ఆర్థిక వృద్ధిలో సీబీఐసీ పాత్రను తెలియజేసే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 24న ‘సెంట్రల్‌ ఎక్సైజ్‌ డే’గా నిర్వహిస్తారు. పన్నుల దాఖలు ప్రాముఖ్యతతోపాటు సుంకాల ఎగవేత వల్ల జరిగే పరిణామాల గురించి ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

కేంద్ర ఎక్సైజ్‌ సుంకం

  • వస్తువు అమ్మకంతో సంబంధం లేకుండా వస్తువు ఉత్పత్తిపై దీన్ని విధిస్తారు
  • 1894లో మొత్తం పత్తి, నూలుపై ఎక్సైజ్‌ సుంకం విధించారు. 1934లో పంచదార, అగ్గిపెట్టెలు, ఉక్కు దిమ్మెలు సహా అనేక వస్తువులను దీని పరిధిలోకి తెచ్చారు. క్రమంగా టైర్లు, ట్యూబులు, కాఫీ, టీ కూడా ఈ పన్ను విధించే వస్తువుల జాబితాలో చేరాయి.
  • 1930 మధ్యకాలం వరకు కేవలం మోటర్‌ స్పిరిట్‌ (1917), కిరోసిన్‌ (1922), నూలు (1924) లాంటి వాటిపై ఎక్సైజ్‌ సుంకం ఉండేది.
  • 2017, జులై 1న వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చాక ముడి చమురు, పెట్రోల్, డీజిల్, ఏవియేషన్‌ టర్బైన్‌ ఇంధనం, సహజ వాయువు, పొగాకు ఉత్పత్తులకు దీన్ని పరిమితం చేశారు
  • ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాలను గణనీయంగా పెంచేందుకు 2025లో సవరణ బిల్లు చేశారు. దీని ప్రకారం సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్‌ సుంకం, పాన్‌ మసాలాపై ఆరోగ్య సెస్‌ 2026, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. జీఎస్‌టీ రేటుకు మించి అత్యధికంగా వీటిపై 40 శాతం సుంకం విధించారు.

చారిత్రక నేపథ్యం

  • దేశంలో ఉప్పు సహా ఇతర తయారీ వస్తువులపై ఎక్సైజ్‌ సుంకాలను ఏకీకృతం చేసే ఉద్దేశంతో నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం 1944, ఫిబ్రవరి 24న సెంట్రల్‌ ఎక్సైజ్‌ అండ్‌ సాల్ట్‌ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఎక్సైజ్‌ పన్నులకు సంబంధించి అప్పటి వరకు ఉన్న 11 చట్టాలను ఏకీకృతం చేసి దీన్ని అమలు చేశారు. 1966లో దీని పేరును సెంట్రల్‌ ఎక్సైజ్‌ చట్టం, 1944గా మార్చారు. దేశంలో సక్రమ పన్ను విధింపు, సేకరించడంలో ఈ చట్టం ఎంతగానో తోడ్పడింది. పరిశ్రమల లైసెన్సింగ్, వస్తువుల అధిక ఉత్పత్తి నియంత్రణకు, పరిశ్రమల్లో అవినీతిని అరికట్టడానికి ఇది ఉపయోగపడింది. అంతేకాక దీని అమలు వల్ల ప్రభుత్వానికి పన్ను రూపంలో అధిక ఆదాయం సమకూరుతోంది. ఈ చట్టం అమలుకు గుర్తుగా ఏటా ఫిబ్రవరి 24న ‘సెంట్రల్‌ ఎక్సైజ్‌ డే’గా నిర్వహిస్తున్నారు. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) కింది ఏ సంవత్సరంలో అధికారికంగా ఏర్పాటైంది?(ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2022)

1) 1956     2) 1960    3) 1964     4) 1968

సమాధానం: 3

2. భారతదేశంలో ఏటా ఫిబ్రవరి 24న కింది ఏ దినోత్సవాన్ని జరుపుతారు?(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ 2025)

1) జాతీయ ఎక్సైజ్‌ దినోత్సవం

2) జాతీయ యువజన దినోత్సవం

3) జాతీయ సైన్స్‌ దినోత్సవం 

4) జాతీయ ఓటర్ల దినోత్సవం

సమాధానం: 1

3.ఎక్సైజ్‌ సుంకాన్ని కింది దేనిపై విధిస్తారు?(ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ప్రిలిమ్స్, 2019)

1) వస్తువుల ఎగుమతి        2) వస్తువుల దిగుమతి

3) వస్తువుల అమ్మకం        4) వస్తువుల ఉత్పత్తి

సమాధానం: 4

4. _____________ is/are an item for which both, GST and central excise duty are applicable in India.(SSC CHSL Tier-I, 2023)

1) Alcohol for human consumption

2) Tobacco and tobacco products

3) Petroleum products

4) All the agricultural commodities

Answer: 2

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram