దేశంలో పప్పుధాన్యాల స్థితిగతులపై ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్ ఆధ్వర్యంలో రూపొందించిన అధ్యయన నివేదిక 2026, ఏప్రిల్ 30న విడుదలైంది. భారత్లో పప్పుధాన్యాల విప్లవం రావాల్సిన ఆవశ్యకత ఉందని, దేశం దిగుమతుల నుంచి ఎగుమతుల వైపు పురోగమించాలని హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) నివేదిక సూచించింది. వంద శాతం స్వదేశీ పప్పుధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని 2030లోగా సాధించే దిశగా అడుగులు వేయాలంది.
దేశంలో ఏటా 25 మిలియన్ టన్నుల పప్పుధాన్యాలు ఉత్పత్తి అవుతుండగా 5 నుంచి 6 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. వీటి కోసం రూ.వేల కోట్లు వెచ్చిస్తున్నాం. ప్రధానంగా కంది, మినుము, పెసర వంటి పప్పులు అమెరికా, మయన్మార్, ఆస్ట్రేలియా, కెనడా, ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి.