ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తోంది. ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం 8వ తరగతి తరువాత విద్యార్థులు డ్రాపవుట్ కాకుండా వారిని ప్రోత్సహించడం, ప్రాథమిక విద్యను కొనసాగించడం. పరీక్షకు సంబంధించిన ప్రకటనను ఆంధ్రపదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) విభాగం తాజాగా విడుదల చేసింది.
వివరాలు:
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ 2025-26
ప్రతి సంవత్సరం దేశం అంతటా 1,00,000 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. వీరిలో 4087 స్కాలర్షిప్లను ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. ప్రభుత్వ / స్థానిక సంస్థలు / మున్సిపల్ / ఎయిడెడ్ పాఠశాలలు / మోడల్ పాఠశాలల్లో (నివాస సౌకర్యం లేకుండా) ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఈ పరీక్షను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. లబ్ధిదారులను మెరిట్ ఆధారంగా రాష్ట్రం అనుసరిస్తున్న రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు.
వివరాలు:
ఏడాదికి రూ.12 వేల ఆర్థిక ప్రోత్సాహం: ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1,000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్షిప్గా అందిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తిచేసే వరకు ఉపకారవేతనం లభిస్తుంది.
అర్హతలు:
ఏడో తరగతిలో 55 శాతం మార్కులు పొందిన విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులు. తుది ఎంపిక సమయం నాటికి ఎనిమిదో తరగతిలో 55 శాతం మార్కులు పొంది ఉండాలి.
ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలో చదువుతూ ఉండాలి.
విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000 మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా విద్యార్థులను స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష: ఈ స్కాలర్షిప్స్కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల రాత పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్ష విధానం:
1. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్): 90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 90 మార్కులు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు.
2. స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్): 90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు. మొత్తం 90 మార్కులు. 7, 8 తరగతుల స్థాయిలో సోషల్, సైన్స్, మ్యాథ్స్ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు.
దరఖాస్తు విధానం: ఆయా స్కూళ్లు రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో విద్యార్థుల దరఖాస్తులను సమర్పించాలి. అనంతరం ఆ దరఖాస్తుల ప్రింటవుట్లను, ధ్రువీకరణ పత్రాలను డీఈవోలకు పంపాలి. బీసీ, ఓసీ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.100 (ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులకు రూ.50) ఎస్బీఐ చలానా రూపంలో జతచేయాలి. దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థి ఆధార్కార్డ్లో ఉన్న విధంగానే పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు నమోదు చేయాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు చెల్లింపు ప్రారంభం: 10-09-2025.
సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ: 30-09-2025
పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ: 10-10-2025.
దరఖాస్తు ఫారాలు, ధ్రువపత్రాలను డీఈవో కార్యాలయంలో అందజేసేందుకు చివరి తేదీ: 15-10-2025.
డీఈవో లాగిన్లో దరఖాస్తు ఆమోదం పొందేందుకు చివరి తేదీ: 20-10-2025.