స్వాతంత్య్రోద్యమంలో వీర వనితలు

స్వాతంత్య్రోద్యమంలో వీర వనితలు

భారత స్వాతంత్య్రోద్యమంలో పురుషులతోపాటు మహిళలు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారు. ఆంగ్లేయుల అరాచకాలను ఎండగట్టడం, ప్రజలను సమీకరించడం, ధర్నాలు నిర్వహించడం, నిరసనలు చేపట్టడం లాంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తద్వారా ఉద్యమ స్ఫూర్తిని వ్యాప్తి చేయడంలో తమవంతు కృషి చేశారు. వీరు కేవలం స్వరాజ్య పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాక లింగ సమానత్వం, సామాజిక నిబంధనలు - కట్టుబాట్లను పునర్నిర్మించడంలోనూ కీలకంగా వ్యవహరించారు. దేశ చరిత్రలో స్త్రీ ఔన్నత్యాన్ని భారత స్వాతంత్య్రోద్యమం మరోసారి చాటిచెప్పింది. పోటీ పరీక్షల నేపథ్యంలో నాడు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన వీరవనితల గురించి ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!

ఝాన్సీ లక్ష్మీబాయి: డల్హౌసీ ప్రకటించిన రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలుపరిచిన బ్రిటిషర్లు ఈమె దత్తపుత్రుడు దామోదరరావును సంస్థానాధీశుడిగా అంగీకరించకుండా ఝాన్సీ రాజ్యాన్ని ఆక్రమించారు. దాంతో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నారు. 1858, జూన్‌లో జరిగిన గ్వాలియర్‌ యుద్ధంలో పాల్గొని బ్రిటిష్‌ దళాలతో వీరోచితంగా పోరాడారు. అదే యుద్ధంలో వీరమరణం పొందారు.

సావిత్రిబాయి ఫూలే: ప్రముఖ సంఘసంస్కర్త జ్యోతిరావు ఫూలే భార్య. లింగవివక్షకు వ్యతిరేకంగా కులరహిత సమాజం, సార్వత్రిక విద్య కోసం ఈ దంపతులు అవిశ్రాంత పోరాటం చేశారు. భర్తతో కలిసి 1848 పుణెలో బాలికల పాఠశాలను స్థాపించారు.  

అనిబిసెంట్‌ (1847 - 1933): ఈమె ఐర్లాండ్‌కు చెందినవారు. దివ్యజ్ఞాన సమాజ సేవ కోసం భారతదేశానికి వచ్చారు. 1914లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. 1916, సెప్టెంబరులో హోమ్‌రూల్‌ లీగ్‌ స్థాపించి, స్వపరిపాలనను డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం నడిపారు. ఈ ఉద్యమ ప్రచారానికి ‘కామన్‌ వీల్‌’, ‘న్యూ ఇండియా’ అనే పత్రికలు స్థాపించారు.  

మాతంగిని హజ్రా (1870 - 1942): గాంధీజీ పిలుపు మేరకు, 1932లో బెంగాల్‌లోని మేధినీపుర్‌ జిల్లాలో శాసనోల్లంఘన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తూములూక్‌ (toomluk) కోర్టు భవనంపై జాతీయ జెండా ఎగరవేయడానికి ప్రయత్నించడంతో బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్టు చేసింది.  

మేడం బికాజీ కామా (1861 - 1936): దాదాభాయ్‌ నౌరోజీ, శ్యాంజీ కృష్ణవర్మల నుంచి ప్రేరణ పొంది స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ప్లేగు వ్యాధి బారినపడి, చికిత్స కోసం లండన్‌ వెళ్లారు. ఎందరో విప్లవకారులకు మార్గదర్శిగా నిలిచారు. ‘ఫ్రీ ఇండియా సొసైటీ’ని స్థాపించారు.  

కమలాదేవి చటోపాధ్యాయ: 1923లో గాంధీజీ పిలుపుమేరకు సహాయ నిరాకరణ ఉద్యమ సేవాదళ్‌ సంస్థలో పనిచేశారు. 1930లో గాంధీజీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1930, జనవరి 26న భారత జాతీయ పతాకాన్ని పోలీసులు అడ్డుకున్నా, ఎగురవేశారు.

సరోజినీ నాయుడు: బొంబాయి (1915), లఖ్‌నవూ (1916) కాంగ్రెస్‌ మహాసభల్లో పాల్గొన్నారు. 1925, డిసెంబరులో కాన్పూర్‌లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ మహాసభలకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళగా నిలిచారు.  

రాణి గైడిన్లు: మణిపుర్‌కు చెందిన ఈమె ఈశాన్య రాష్ట్రాల్లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్న ఈమెను బ్రిటిష్‌ ప్రభుత్వం 1932లో జైలుకు పంపింది.  

ఉషా మెహతా: క్విట్‌ ఇండియా ఉద్యమంలో గాంధీజీతో సహా ప్రముఖ నాయకులను బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ సమయంలో ఉషా మెహతా బొంబాయిలో రహస్య రేడియో ప్రసారాలతో  ఉద్యమకారులను చైతన్యపరిచారు.  

బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన వీరవనితల గురించి పూర్తి సమాచారం ఈబుక్‌ రూపంలో ఈనాడు ఈప్రతిభ వాట్సాప్‌ ఛానెల్‌లో అందుబాటులో ఉంది. వెంటనే ఫాలో చేసి, పోటీ పరీక్షలకు ఉపయోగపడే సమాచారాన్ని ప్రతి రోజూ ఉచితంగా అందుకోండి. https://hov.to/e05e8f1a 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

ప్రశ్న: కింది ఏ రంగంలో చేసిన కృషికి సావిత్రీబాయి ఫూలే పేరు పొందారు?

(యూజీసీ నెట్‌ పేపర్‌ 2, 2019)

1) షెడ్యూల్డ్‌ కులాల అభ్యున్నతి    2) పేదల అభ్యున్నతి

3) మహిళల విద్య             4) మురికివాడల పిల్లల విద్య

సమాధానం: 3

ప్రశ్న: న్యూ ఇండియా గ్రంథ రచయిత ఎవరు?

(ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ - డి, 2018)

1) మదర్‌ థెరిస్సా      2) మహాత్మా గాంధీ

3) అనిబిసెంట్‌        4) జవహర్‌లాల్‌ నెహ్రూ

సమాధానం: 3

Q: What was the fate of Rani Lakshmibai of Jhansi after the Battle of Gwalior in 1858?
(RPF Constable 2025)
1) She was captured and executed.
2) She became the ruler of Gwalior.
3) She died fighting in battle.
4) She was exiled to Britain
Ans: 3

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram