భారతీయ రక్షణ రంగం - డీఆర్‌డీఓ

భారతీయ రక్షణ రంగం - డీఆర్‌డీఓ

దేశ భద్రతలో రక్షణ రంగానిదే ముఖ్య భూమిక. భారత్‌లో ఈ రంగానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోనే జరుగుతాయి. రక్షణపరమైన పరిశోధన సామర్థ్యాలను మెరుగుపరచడం, జాతీయ భద్రతను బలోపేతం చేయడం, ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని నిలబెట్టడం మొదలైనవి సాధించడంలో డీఆర్‌డీఓ వ్యూహాత్మక పాత్ర పోషిస్తుంది. అంతేకాక శాస్త్ర, సాంకేతిక రంగంలో మన దేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చడంలోనూ ఇది క్రియాశీలకంగా పనిచేస్తోంది. భారత సైనిక దళాల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను, డిఫెన్స్‌ టెక్నాలజీని రూపొందించడం, అభివృద్ధి చేయడం, ఉత్పత్తి చేయడం దీని ముఖ్య విధి. పోటీపరీక్షల నేపథ్యంలో డీఆర్‌డీఓకు సంబంధించిన ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

ఏర్పాటు - విశేషాలు

  •  భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక, అప్పటి ప్రభుత్వం ప్రధానంగా రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఈ రంగంలో దేశం స్వయం సమృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం డిఫెన్స్‌ సైన్స్‌ ఆర్గనైజేషన్‌ (డీఎస్‌ఓ), డిఫెన్స్‌ టెక్నికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (డీటీడీఈ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ (డీటీడీపీ)లను ఏర్పాటు చేసింది.
  • 1958లో ప్రభుత్వం డీఎస్‌ఓ, డీటీడీఈ, డీటీడీపీ సంస్థలను విలీనం చేసి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)ను ఏర్పాటు చేసింది.
  • ఇది ముఖ్యంగా ఏరోనాటిక్స్, ఎలక్ట్రానిక్స్, కంబాట్‌ వెహికల్స్, ఇంజినీరింగ్‌ సిస్టం, ఇన్‌స్ట్రుమెంటేషన్, అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్, స్పెషల్‌ మెటీరియల్స్, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్, వ్యవసాయం, లైఫ్‌ సైన్సెస్, సైబర్‌ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మొదలైన రంగాల్లో పరిశోధనలు చేస్తోంది. 

నాయకత్వం

  • డీఆర్‌డీఓకు ఛైర్మన్‌ నాయకత్వం వహిస్తారు. మొదట్లో ఈ పదవిని డైరెక్టర్‌ జనరల్‌గా పిలిచేవారు. 2015లో ఛైర్మన్‌గా పేరు మార్చారు. ప్రస్తుతం డీఆర్‌డీఓ ఛైర్మన్‌గా డాక్టర్‌ సమీర్‌ వి. కామత్‌ ఉన్నారు (2022, ఆగస్టు 26 నుంచి 2025, డిసెంబరు 21 నాటికి). 

భారతదేశ క్షిపణి ప్రోగ్రాం

  • భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్‌ కలాం ఆధ్వర్యంలో 1983 జులై  26న ఇంటిగ్రేటెడ్‌ గైడెడ్‌ మిస్సైల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఐజీఎండీపీ)ను ప్రభుత్వం ప్రారంభించింది. స్వదేశీ గైడెడ్‌ క్షిపణులను అభివృద్ధి చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ కారణంగానే కలాంను ‘మిస్సైల్‌ మాన్‌ ఆఫ్‌ ఇండియా’, ‘ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ మిస్సైల్‌ టెక్నాలజీ’గా పిలుస్తారు.
  • డీఆర్‌డీఓ.. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డ్, ఇతర భారత ప్రభుత్వ సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
  • ఈ ప్రోగ్రాం ద్వారా దేశ రక్షణ అవసరాలకు అనుగుణంగా అయిదు రకాల క్షిపణి వ్యవస్థలను రూపొందించాలని ప్రభుత్వం భావించింది. అవి:

1. పృథ్వి: ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే తక్కువ రేంజ్‌ కలిగిన బాలిస్టిక్‌ క్షిపణి.

2. అగ్ని: ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మధ్యస్థ దూరం (intermediate range) కలిగిన బాలిస్టిక్‌ క్షిపణి 

3. త్రిశూల్‌: షార్ట్‌ రేంజ్‌లో ప్రయాణించగల సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌.

4. ఆకాష్‌: మధ్యస్థ దూరం కలిగిన, ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ.

5. నాగ్‌: మూడో తరానికి చెందిన యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్‌.

  • ప్రారంభంలో అగ్ని మిస్సైల్‌ వ్యవస్థను ఐజీఎండీపీ కిందకి తెచ్చినా.. తర్వాతి కాలంలో వేరు చేశారు.
  • క్షిపణి వ్యవస్థలో భారత్‌ను స్వయం సమృద్ధి దేశంగా రూపొందించడంలో డీఆర్‌డీఓ సఫలీకృతం అయ్యింది.
  • 2008, జనవరి 8న ఐజీఎండీపీ విజయవంతంగా పూర్తయినట్లు డీఆర్‌డీఓ ప్రకటించింది.
Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram