సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజేతలుగా నిలిచినప్పటికీ ఓబీసీ సంపన్న శ్రేణి (క్రీమీలేయర్) పరిధిలో ఉన్నారనే కారణంతో ఉద్యోగ నియామకాలు పొందలేని అభ్యర్థులకు సర్వోన్నత న్యాయస్థానం భారీ ఉపశమనం కల్పించింది. ఓబీసీ సంపన్న శ్రేణి నిర్ధరణకు తల్లిదండ్రుల జీతాలు మాత్రమే ప్రామాణికం కాదని, వారి ఉద్యోగ హోదా, ఆ పోస్టు కేటగిరీని కూడా పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఆర్.మహదేవన్ ధర్మాసనం 2026, మార్చి 12న తీర్పు వెలువరించింది. తీర్పులోని ముఖ్యాంశాలు..
ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్యూ), ప్రైవేట్ రంగంలోని ఉద్యోగుల పిల్లల ఆదాయ గణనలో తేడాలు ఉంటాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడం వివక్షే. తల్లిదండ్రులు నిర్వహిస్తోన్న పదవులు, వారి హోదాలు పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఆదాయం ప్రాతిపదికన సంపన్న శ్రేణిని నిర్ణయించడం చట్టరీత్యా చెల్లదు.
వేతన ఆదాయాన్ని, వ్యవసాయ ఆదాయాన్ని, ఇతర వనరుల ద్వారా సమకూరే ఆదాయాన్ని కలిపి సంపన్న శ్రేణిని నిర్ణయించరాదంది.