సామాజిక సాధికారత స్మారక దినోత్సవం

సామాజిక సాధికారత స్మారక దినోత్సవం

కులం, మతం, లింగంతో సంబంధం లేకుండా అన్ని రంగాల్లోని ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే సామాజిక సాధికారత. దేశాభివృద్ధిలో ఇది కీలక భూమిక పోషిస్తుంది. ఒకప్పుడు సమాజంలో అంటరానితనం, సామాజిక వివక్ష లాంటి రుగ్మతలు ఉండేవి. వాటిని రూపుమాపేందుకు బలంగా పోరాడిన వ్యక్తుల్లో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఒకరు. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన ప్రారంభించిన ‘మహద్‌ సత్యాగ్రహానికి’ గుర్తుగా ఏటా మార్చి 20న ‘సామాజిక సాధికారత స్మారక దినోత్సవం’గా (Social Empowerment Memorial Day) నిర్వహిస్తారు. దీన్నే ‘సామాజిక సాధికారత దినోత్సవం’ (Social Empowerment Day) అనే పేరుతోనూ పిలుస్తారు. అణగారిన వర్గాల హక్కులను తెలియజేయడంతోపాటు వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 

సామాజిక సాధికారత అంటే?

  • సమాజం సృష్టించిన అన్ని రకాల అసమానతలు, వ్యత్యాసాలను తొలగించడాన్ని సామాజిక సాధికారత అంటారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితంలో వ్యక్తులు స్వేచ్ఛగా పాల్గొనడానికి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానం, అవకాశాలు పొందే ప్రక్రియను ఇది సూచిస్తుంది.
  • అణగారిన, వెనుకబడిన వర్గాల ఉన్నతీకరణకు ఇది తోడ్పడుతుంది.

మహద్‌ సత్యాగ్రహం

  • 1924, జనవరిలో బొంబాయి ప్రావిన్స్‌లో భాగమైన మహద్‌ పురపాలిక మండలి  సీతారాం కేశవ్‌ బోలే తీర్మానం ప్రకారం అక్కడి చౌదర్‌ చెరువును అన్ని వర్గాల వారు ఉపయోగించుకునేలా చట్టం చేసింది. అయితే ఉన్నత వర్గాల వారి నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో దాని అమలును నిలిపివేశారు. దీనికి నిరసనగా అంబేడ్కర్‌ సత్యాగ్రహాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.
  • 1927, మార్చి 20న ‘మహద్‌ సత్యాగ్రహం’ పేరుతో అంబేడ్కర్‌ నాయకత్వంలో సుమారు 5వేల మంది మహద్‌లోని చౌదర్‌ చెరువు వద్దకు చేరుకుని అందులోని నీటిని తాగారు. ఈ సంఘటన అణగారిన వర్గాల్లో కొత్త ఆశను రేకెత్తించింది. పోరాడనిదే ఏదీ సాధించలేమని వారికి అర్థమైంది.
  • అణచివేత, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన విస్తృత పోరాటంగా ఈ సత్యాగ్రహం పేరొందింది. 

భారత్‌లో అణగారిన వర్గాలు

  • అణగారిన వర్గాలు అంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతిక పరంగా ఒక క్రమ పద్ధతిలో బహిష్కరణకు గురైన సమూహాలు. వీరు వనరులు, అవకాశాలు పొందడంలో అనేక అడ్డంకులు ఎదుర్కొంటారు.
  • భారత్‌లో అణగారిన వర్గాలు: షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన వర్గాలు (ఓబీసీ), మహిళలు - బాలికలు, వికలాంగులు, మతపరమైన మైనార్టీలు, వృద్ధులు, సచార జాతులు.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం, మన దేశంలో ఎస్సీ కులాల వాటా 16.6%, వీరిలో 1,221పైగా విభిన్న కులాలు ఉన్నాయి. పంజాబ్‌లో వీరిశాతం అత్యధికంగా (32%) ఉంది.
  • మొత్తం జనాభాలో ఎస్టీల వాటా 8.6%. వీరిలో 669 భిన్న తెగలు ఉన్నాయి. మిజోరం, లక్షద్వీప్‌లో వీరి సాంద్రత అత్యధికంగా (95%) ఉంది.
  • మతపరమైన మైనార్టీలు మొత్తం జనాభాలో 19.3% వాటా కలిగి ఉన్నారు. వీరిలో ముస్లింలు: 14.2%, క్రైస్తవులు: 2.3%, సిక్కులు: 1.7%, బౌద్ధులు: 0.7%, జైనులు: 0.4%, పార్సీలు: 0.006% ఉన్నారు.

చారిత్రక నేపథ్యం.. 
అణగారిన వర్గాల హక్కుల కల్పనకు, వారిలో పోరాట స్ఫూర్తిని రేకెత్తించడానికి మహద్‌ సత్యాగ్రహం ఎంతగానో తోడ్పడింది. దళితులు చౌదర్ చెరువు నీటిని వాడుకోవచ్చని బొంబాయి హైకోర్టు తీర్పు వెలువరించాక 1940, మార్చి 19న అంబేడ్కర్‌ మహద్‌లో ర్యాలీ నిర్వహించారు. మహద్‌ సత్యాగ్రహానికి గుర్తుగా ఏటా మార్చి 20న ‘సాధికారత దినోత్సవం’గా జరుపుకోవాలని పిలుపు ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1.డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కింది ఏ సంవత్సరంలో మహద్‌ సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు?
(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2025)

1) 1925   2) 1918

3) 1923   4) 1927

సమాధానం: 4

2.సామాజిక సాధికారత స్మారక దినోత్సవం లేదా సామాజిక సాధికారత దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

(45వ బీపీఎస్సీ ప్రిలిమ్స్, 2002),(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2023)

1) మార్చి 18    2) మార్చి 18

3) మార్చి 20    4) మార్చి 21

సమాధానం: 3

Q. Which of the following is an appropriate way to counter the marginalization of tribals?
(CTET Paper 2 Social Science, 2021)

1) Portraying tribals as exotic

2) Presenting tribal history

3) Showcasing tribals as vibrant

4) Arranging a dance performance

Ans: 2

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram