పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ (వస్తు సేవల పన్ను)కి, అదనంగా ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది 2026 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ‘పొగాకుపై పన్ను విధానాలకు’ అనుగుణంగా ఈ చర్య చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో పొగాకుపై పన్నులను ఏటా సవరిస్తున్నారు.
జీఎస్టీ అమలుకు ముందు భారత్లోనూ సిగరెట్లపై ఏటా ఎక్సైజ్ సుంకాన్ని సవరించేవారు. 2017 జులైలో జీఎస్టీ అమల్లోకి వచ్చాక గత ఏడేళ్లుగా ఎటువంటి మార్పులూ చేపట్టలేదు. జీఎస్టీలోని గరిష్ఠమైన 28% పన్నుతో పాటు పరిహార సుంకం మాత్రమే ఇప్పటివరకు విధిస్తున్నారు.