భారతీయ బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్డీఐ) అనుమతిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో విదేశీ కంపెనీలు ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండానే పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టొచ్చు. భారీగా మూలధనాన్ని ఆకర్షించడం, పోటీని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎఫ్డీఐను నేరుగా (ఆటోమేటిక్) అనుమతించడం ద్వారా విదేశీ పెట్టుబడిదారులకు ఇకపై ప్రభుత్వ ముందస్తు అనుమతులతో పనిలేదు.
ప్రస్తుతం బీమా సంస్థల్లో 74 శాతం వరకే ఎఫ్డీఐలకు అనుమతి ఉంది. ఇకపై విదేశీ సంస్థలు 100 శాతం పెట్టుబడితో భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) అనుమతితో సొంతంగా భారత బీమా వ్యాపారంలోకి ప్రవేశించవచ్చు. ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓలో ఎవరో ఒకరు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలన్న నిబంధన ఉంది.